భారత్‌ను భారీ విజయం ఊరిస్తోంది..

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేందుకు టీమిండియా ఇంకా నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. బంగ్లాతో పింక్‌ బాల్‌ టెస్టులో భాగంగా శనివారం రెండో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ వరుస విరామాల్లో కోల్పోయి ఎదురీదుతోంది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఈరోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా బంగ్లాదేశ్‌ ఆరో వికెట్‌ను చేజార్చుకుంది. ఆరో వికెట్‌గా తైజుల్‌ ఇస్లామ్‌(11) ఔటైన తర్వాత రెండో రోజు ఆటను ముగించారు. ఇంకా బంగ్లాదేశ్‌ 89 పరుగులు వెనుకబడి ఉండటంతో భారత్‌కు మరో ఇన్నింగ్స్‌ విజయం ఖాయంగానే కనబడుతోంది. ముష్పికర్‌(59 బ్యాటింగ్‌: 70 బంతుల్లో 10 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.